రాష్ట్రంలో వర్షాలు, వరదలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంటువ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్లకు సీఎస్ దిశానిర్దేశం చేశారు. సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని సీఎస్ పేర్కొన్నారు. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు, సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పారు. ఉస్మాన్, హిమాయత్ సాగర్లకు వరద అధికంగా వచ్చే అవకాశం ఉందన్నారు. జలాశయాలు, చెరువులకు గండ్లు పడకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లు, వంతెనలు తెగిన మార్గాల్లో ప్రమాదాలు జరగకుండా చూడాలని సీఎస్ ఆదేశించారు.