సీఎం కేసీఆర్
దేశంలో ఫసల్ బీమా యోజన శాస్త్రీయంగా లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, ఫసల్ బీమా లేదా మరొకటిఏదన్నా కానీ అదంతా వట్టి బోగస్ అని ధ్వజమెత్తారు. ఫసల్ బీమా యోజనతో రైతులకు లాభం చేకూరట్లేదని, ఫసల్ బీమా యోజనపై కేంద్రానికి సూచనలు పంపుతామని అన్నారు. దేశానికి బాధ్యత వహిస్తున్న కేంద్రానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆహార ధాన్యాల కొరత రాకుండా శీతల గోదాములు నిర్మించాలి. శీతల గోదాములు నిర్మించాల్సిన బాధ్యత కూడా కేంద్రంపైనే ఉంటుంది. ఆహార ధాన్యాల కొరతే ఏర్పడితే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించవచ్చు. వరి ధాన్యం మేం కొనుగోలు చేయబోమని కేంద్రం చెబుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ధరణి పోర్టల్ ద్వారా రైతులకు చాలా ఉపశమనం కలిగిందన్నారు. అబ్ధుల్లాపూర్మెట్ తరహా ఘటనలు జరగకుండా ఉండేందుకు ధరణి తెచ్చామని చెప్పారు.