కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఇవాళ ఉదయం నుంచి బీజేపీ టార్గెట్గా వరుస ట్వీట్లు చేస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో నిషేధించిన పదాలపై ఉదయం ట్వీట్ చేశారు. ఇదా మీ భాష అంటూ కొన్ని వ్యాఖ్యలను ఉదహరిస్తూ బీజేపీపై ట్విటర్లో మండిపడ్డారు. ‘ప్రధాని నిరసనకారులను ‘ఆందోలన్ జీవి’ అని పిలవడం మంచిదా? యూపీ సీఎం చేసిన ‘80`20’ ఓకేనా ? మహాత్మాగాంధీని బీజేపీ ఎంపీ కించపరిచిన తీరు బాగుందా? రైతు నిరసనకారులను ఉగ్రవాదులు అని అవమానించడం సరైందేనా..? ఇవన్నీ సరైనవేనా అని పరోక్షంగా మోదీని ప్రశ్నిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత కేంద్ర వ్యవసాయ శాఖ ట్వీట్ చేసిన పోస్ట్ను ట్యాగ్ చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు. దేశంలో ఏ రాష్ట్ర రైతులు తమ ఆదాయాన్ని రెండిరతలు చేసుకున్నారో వివరించాలంటూ ట్వీట్లో కేటీఆర్ నిలదీశారు.ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు కేంద్రం కృషి చేస్తోందని.. ఇప్పటికే చాలా మంది రైతులు వారి ఆదాయాన్ని రెండిరతలు చేసుకున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ ఒక ప్రకటనతో ఫొటో షేర్ చేసింది. దాంతో ఆ ఫొటోను ట్యాగ్ చేస్తూ కేటీఆర్ కేంద్ర వ్యవసాయ శాఖకు కొన్ని ప్రశ్నలు సంధించారు.దేశంలో ఎన్ని లక్షల మంది రైతులు తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకున్నారు..? ఈ రైతులంతా ఏ రాష్ట్రానికి చెందిన వారు..? దీనిని సాధించడానికి ప్రభుత్వం ఏం చేసింది..? అంటూ ఇలా మూడు ప్రశ్నలతో కేటీఆర్ ట్వీట్ చేశారు.