Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

బీజేపీ రైతు వ్యతిరేక పార్టీ : మంత్రి నిరంజన్‌ రెడ్డి

రైతుల ఉసురు తీసుకుంటున్నారని, బీజేపీ పక్కా బిజినెస్‌, కార్పొరేట్‌ పార్టీ అని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్‌ రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద బీజేపీ నేతలు, కార్యకర్తలు సృష్టించిన విధ్వంసంపై మంత్రి మండిపడ్డారు. తెలంగాణ రైతులు సంతోషంగా ఉండటం రాష్ట్ర బీజేపీ నాయకులకు నచ్చడం లేదని అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పనీపాటా లేని బీజేపీ నేతలు లేనివి ఉన్నట్లు చిత్రీకరించి సమస్యగా మారారన్నారు. యాసంగి ధాన్యం కేంద్రం కొంటుందో, లేదో చెప్పాలని కోరుతున్నామన్నారు. బీజేపీ నాయకులు అవివేకమైన చర్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం మీద నెగిటివ్‌ ప్రచారం చేయాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్దకు పోయి కొనుగోలు చేయాలని అంటున్నాడు. ఇది బండి సంజయ్‌ మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు.బీజేపీ నాయకులు ఆటోలో కర్రలు, రాడ్లు తీసుకెళ్లి రైతులపై దాడి చేసేందుకు యత్నించారు. తెలంగాణ ప్రభుత్వం వానాకాలం పంట కొంటుంది. యాసంగి వడ్లపై సమాధానం చెప్పండి అని రైతులు కూడా బీజేపీ నాయకులను నిలదీస్తున్నారని అన్నారు. రైతులకు ఇచ్చే కరెంట్‌లో బీజేపీ పాత్ర లేదన్నారు. రైతుల మోటార్లకు మీటర్లును పెట్టాలని బీజేపీ ప్రభుత్వం చూస్తోందన్నారు. ఏ అర్హతతో రైతుల వద్ద ఆందోళన చేయటానికి వెళ్ళారని సంజయ్‌ను ప్రశ్నించారు. స్వతంత్ర భారతంలో రోజుల తరబడి రైతులు రోడ్ల మీద ధర్నా చేస్తుండటం బీజేపీ పాలనకు నిదర్శనమని ఆయన ఎద్దేవా చేశారు. రైతు కష్టంలో కానీ రైతు పథకాల్లో కానీ బీజేపీ పాత్ర లేదు. నీళ్ల విషయంలోనూ బీజేపీ నాయకులు దుర్మార్గపు రాజకీయం చేస్తున్నారు. రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. ప్రశాంతంగా ఉన్న రైతు లోకాన్ని మీ మూర్ఖపు చర్యలతో ఇబ్బంది పెడుతున్నారు. బీజేపీ రైతు వ్యతిరేక పార్టీ. రైతులపై చిత్తశుద్ధి ఉంటే దిల్లీ వెళ్లి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని ఆయన సవాల్‌ విసిరారు. రైతుల వద్దకు వెళ్ళి మీ ఇష్టానుసారంగా చేస్తామంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img