జనావాసాల మధ్య ఉన్న గోదాములను తరలించడం ద్వారా భవిష్యత్ లో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మినిస్టర్ రోడ్ లో అగ్నిప్రమాదం జరిగిన డెక్కన్ మాల్ భవనంను కూల్చివేయగా, మంత్రి వివిధ శాఖల అధికారులతో సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక కాలనీలో పర్యటించి ఈ ప్రమాదంతో జరిగిన నష్టం గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అగ్నిప్రమాదం వలన తమ ఇండ్లపై ఉన్న సింటెక్స్ ట్యాంక్ లు కాలిపోయాయని, గోడలు నెర్రెలు వచ్చాయని, తదితర విషయాలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన మంత్రి ఇచ్చిన హామీ మేరకు మరమ్మతులు ప్రభుత్వ పరంగా చేపడతామని, ట్యాంక్ లను కూడా కొత్తవి కొనుగోలు చేసి ఇస్తామని కాలనీ వాసులకు చెప్పారు. కాలనీలో పడిపోయిన భవన వ్యర్ధాలను పూర్తి స్థాయిలో తొలగించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీవరేజ్ లైన్ దెబ్బతిందని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకు రాగా, పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.