డీఐజీ ఏవీ రంగనాథ్
గంజాయిపై గత రెండు నెలలుగా వరుసగా చేస్తున్న దాడుల క్రమంలో నల్గొండ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చడం లక్ష్యంగా పని చేస్తున్నామని డీఐజీ ఏవీ రంగనాథ్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం జిల్లాలోని అన్ని మెడికల్ షాపులు, కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.సమావేశంలో డీఐజీ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ, జిల్లాలో మెడికల్ షాపులు, ఏజెన్సీల నిర్వాహకులు డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందులు విక్రయిస్తే కఠినచర్యలతో పాటు పీడీ యాక్టుల నమోదుకు వెనుకాడబోమని హెచ్చరించారు. మెడికల్ షాపుల నిర్వాహకులు తరచుగా మత్తు మందుల కోసం వచ్చే వారి సమాచారం పోలీసులకు ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, అదే సమయంలో మెడికల్ షాపుల నిర్వాహకులకు రక్షణ కల్పించే విషయంలోనూ అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.మంచి సమాజ నిర్మాణం, దేశ నిర్మాణంలో కీలకమైన యువత భవిష్యత్ మత్తు మందుల బారిన పడి నిర్వీర్యం కాకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు.