మంత్రి కేటీఆర్పై షర్మిల విమర్శలు
మంత్రి కేటీఆర్ ఫై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శలు చేసారు.మనమే సరిగ్గా లేనప్పుడు పక్క వారి మీద పడి ఏడిస్తే ఏం లాభమన్నారు. ఇక్కడ ప్రజలు ఏం సంతోషంగా ఉన్నారని మీరు దేశాలను ఏలబోతున్నారంటూ ప్రశ్నించారు. ఇక్కడ ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. ముందు వీరికి సమాధానం చెప్పాలని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డి గ్రామంలో వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పర్యటించారు. ఆమెను కలిసిన ఉపాధిహామీ కూలీలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. 12 వారాలుగా పనిచేయించుకుని డబ్బులు ఇవ్వడంలేదని తెలిపారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో ఉపాధి పథకం తీరు దారుణంగా ఉందన్నారు. ఉపాధికూలీలను శ్రమదోపిడీకి గురిచేస్తున్నారని అన్నారు. కూలీలకు డబ్బు చెల్లించలేని స్థితిలో తెలంగాణ పాలకులు ఉన్నారా? ఇదేనా మంచి పాలన… అంతా దోచుకోవడమేనా మీ విధానం? రాష్ట్రం వ్యాప్తంగా అక్రమ మద్యం ఏరులై పారుతోంది. ఉద్యోగాలు లేక చదువుకున్న బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. చిన్నదొర కేటీఆర్కు ఏపీలో ఫ్రెండ్స్ ఉన్నారట.. అని ఆమె ఎద్దేవా చేశారు. తెలంగాణలో కేటీఆర్కి ఫ్రెండ్స్ లేరని ఆమె అన్నారు. పక్క రాష్ట్రంపై దుమ్మెత్తిపోసే ముందు మన రాష్ట్రం ఎలా ఉందో చూసుకోవాలని ఆమె అన్నారు. తెలంగాణ ప్రజలు ఏం సంతోషంగా ఉన్నారని ఆమె నిలదీశారు. తెలంగాణలోనే పరిస్థితులు బాగోలేకపోతే ఇప్పుడు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దేశాన్ని ఏలతామని చెప్పుకుంటున్నారని ఆమె విమర్శించారు.