పాదయాత్ర సందర్భంగా తమపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఓ టీవీ ఛానల్ తో షర్మిల మాట్లాడుతూ… స్పీకర్ పోచారం తనపై చర్యలు తీసుకుంటే న్యాయ పరంగా ముందుకెళ్తానని చెప్పారు. స్పీకర్ తనపై చర్యలు తీసుకోరనే భావిస్తున్నానని తెలిపారు. ‘‘తనను మరదలు అంటే ఇలానే రియాక్ట్ అవుతానని. ఇంకొకరు అయితే వేరేలా సమాధానం చెప్పే వారని.. మరదలు అంటే ఊరుకోవాలా? మాకు ఆత్మగౌరవం ఉండదా’’ అంటూ షర్మిల నిలదీశారు. ఎమ్మెల్యేల అవినీతిపై ప్రజలు చర్చించుకుంటున్న అంశాలనే తన ప్రసంగాల్లో మాట్లాడుతున్నానని ఆమె స్పష్టం చేశారు. ఒకవేళ పాదయాత్రను అడ్డుకుంటే, మరోలా ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు. ఒకవేళ స్పీకర్ తనపై చర్యలు తీసుకుంటే న్యాయబద్ధంగా ముందుకెళ్తామని షర్మిల తేల్చి చెప్పారు. మంత్రి నిరంజన్ రెడ్డి మొదట అనుచిత వ్యాఖ్యలు చేయడంతోనే తాను ఘాటుగా రియాక్ట్ కావాల్సి వచ్చిందని షర్మిల చెప్పారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై స్థానిక నేతలకు చిత్తశుద్ధి లేదని, అందువల్లే ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. షర్మిల ప్రసంగాలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఇవాళ సభా హక్కుల ఉల్లంఘన కమిటీ సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు షర్మిలపై ఇప్పటికే నిరంజన్ రెడ్డి డీజీపీకి ఫిర్యాదు చేశారు. అయితే, ఇవాళ 152వ రోజు పాదయాత్రను మహబూబ్నగర్ జిల్లాలో షర్మిల ప్రారంభించారు. గాజులపేట క్రాస్, తడికొండ, నెహ్రూనగర్ క్రాస్, ల్లిపూర్, బండమీదపల్లి మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. సాయంత్రం 5 గంటలకు మహబూబ్నగర్ పట్టణం టీటీడీ కల్యాణ మండపం సమీపంలో పాలమూరు నీళ్ల పోరు దీక్ష చేపడతారు. రేపు సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగుతుంది.