ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో అంతిమసంస్కారాలను పూర్తిచేశారు. సిరివెన్నెల చితికి ఆయన జేష్ట కుమారుడు యోగీశ్వరశర్మ నిప్పంటించారు.ఈ ఉదయం సిరివెన్నెల భౌతికకాయాన్ని ఆయన నివాసం నుంచి ఫిలింఛాంబర్కు తీసుకొచ్చారు. అక్కడ ఆయన పార్థివ దేహానికి సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు నివాళులర్పించారు.ఆయనతో తమకున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. అనంతరం సిరివెన్నెల అంతిమ యాత్ర మహాప్రస్థానానికి చేరుకుంది. అక్కడ అంతిమ సంస్కారాల్ని పూర్తి చేశారు. అభిమానులు ఆయనకి కన్నీటి వీడ్కోలు పలికారు.