ప్రయాణికుల అవసరాలను పరిగణలోకి తీసుకుంటూ.. ఎప్పటికప్పుడు మెరుగైన సౌకర్యాలను కల్పిస్తోన్న హైదరాబాద్ మెట్రో రైలు ఇప్పుడు మరో ఆకర్షిణీయమైన వెసులుబాటును అందుబాటులోకి తీసుకొచ్చింది. నగరవాసులను మెట్రో ప్రయాణానికి ఆకర్షించేందుకు మెట్రో యాజమాన్యం.. ఇప్పటివరకు టికెట్ ధరల విషయంలో పలు ఆఫర్లు తీసుకురాగా.. ఇప్పుడు ఆ టికెట్ బుకింగ్ విషయంలో ఆకర్షణీయమైన సౌకర్యాన్ని తీసుకొచ్చింది. వాట్సాప్ ఈ-టికెటింగ్ ద్వారా ఎండ్ టూ ఎండ్ డిజిటల్ చెల్లింపుతో మెట్రో టికెట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని హైదరాబాద్ మెట్రో రైల్ ప్రారంభించింది. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులు ఇక నుంచి వాట్సాప్లోనూ టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు. ప్రస్తుతం పేటీఎంలో టికెట్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉండగా ఇప్పుడు హైదరాబాద్ మెట్రో అధికారులు మరింత వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వాట్సాప్ ద్వారా టికెట్లను కొనుగోలు చేసుకునే అవకాశం తీసుకొచ్చారు. స్మార్ట్ఫోన్ వినియోగదారులందరికీ వాట్సాప్ కామన్ కావడంతో టికెట్లు కోసం ఇకపై క్యూలో నిల్చునే బాధ తప్పినట్టే. దేశంలోనే తొలిసారి తాము ఈ విధానాన్ని తీసుకొచ్చినట్టు హైదరాబాద్ మెట్రో అధికారులు తెలిపారు.ఈ సరికొత్త సర్వీస్ హైదరాబాద్ మెట్రో రైల్లో నిత్యం ప్రయాణించే ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా మారనుంది. ప్రయాణికులు ఇప్పుడు తమ వాట్సాప్ నంబర్లో ఈ-టికెట్ను కొనుగోలు చేయవచ్చు. ఈ టికెట్లను ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ గేట్ల వద్ద స్కాన్ చేసి హాయిగా జర్నీ చేయవచ్చు. ఈ సౌకర్యం టిక్కెట్ బుకింగ్ ఇతర డిజిటల్ మోడ్లకు అంటే టీ సవారీ, పేటీఎం లాంటి ఇతర ఆఫ్షన్స్ కు అదనంగా నిలవనుంది.