మేడారం జాతర ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ , డీజీపీ మహేందర్ రెడ్డిలు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, మేడారం జాతర ఈ నెల 16 వ తేదీ నుండి 19 వరకు జరుగుతుందని తెలిపారు. ఈ సారి కూడా కోటి మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా వేసినట్టు తెలిపారు. ఈ జాతరకు హాజరయ్యే వారికి ఏవిధమైన ఇబ్బందులు రావొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినందున అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎస్ ఆదేశించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో పోలీసు, రెవిన్యూ, గిరిజన, దేవాదాయ, వైద్య ఆరోగ్య, మున్సిపల్, పంచాయితీ రాజ్, గ్రామీణ మంచినీటి సరఫరా, విధ్యుత్, పశు సంవర్ధక శాఖ, రోడ్లు భవనాలు, నీటిపారుదల, ఆర్టీసీ తదితర విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.