కరీంనగర్ కలెక్టర్
యాసంగిలో వరి పంట వేసుకోవచ్చని, ఖరీఫ్ సీజన్లో రైతులు పండిరచిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లాలో 351 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. యాసంగి వరి పంటకు ప్రత్యామ్నాయ పంటలపైన ఇవాళ నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.యాసంగి పంట కాలంలో వివిధ రకాల ప్రయివేటు విత్తన కంపెనీలు, సీడ్ కార్పొరేషన్ వారితో ఒప్పందం ఉన్న రైతులు వరి విత్తన ఉత్పత్తి చేసుకోవచ్చని, అదే విధంగా నీరు నిల్వ ఉండే నేలలు, చౌడు నేలల్లో వరి పంటను సాగు చేసుకోవాలని సూచించారు. యాసంగి సాగుకు అనుకూలమైన శనగ, పెసర, మినుములు వంటి పప్పుదినుసులతో పాటు వేరుశనగ, నువ్వులు, ఆవాల వంటి నూనెగింజల పంటలను సాగు చేయాలని..ఈ పంటల ద్వారా అధిక ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. ఈ పంటల సాగుకు అవసరమైన విత్తనాలను సీడ్ కార్పొరేషన్, అధికృత డీలర్ల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు.