అధికారులకు మంత్రి తలసాని ఆదేశం
రంజాన్ పండుగకు అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు.. సోమవారం జీహెచ్ఎంసి, ఎలెక్ట్రికల్, వాటర్ వర్క్స్, హార్టికల్చర్ తదితర శాఖల అధికారులు, సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మసీదు కమిటీ సభ్యులతో రంజాన్ ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశం నిర్వహించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. గత రెండు సంవత్సరాల నుండి కరోనా మహమ్మారి కారణంగా నిర్వహించుకోలేక పోయారని అన్నారు. ఈ సంవత్సరం రంజాన్ ఒక్క పొద్దులు ( రోజా) ఏప్రిల్ 2 లేదా 3 వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయని, కేవలం 4, 5 రోజుల వ్యవధి మాత్రమే ఉన్నందున అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఏర్పాట్లు చేయాలని అన్నారు.