తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ తలపెట్టిన మహిళా దర్బార్ కార్యక్రమంపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్ భవన్ లో మహిళల దర్బార్ అసలెందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. రాజకీయ కార్యకలాపాలకు రాజ్ భవన్ను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ గవర్నర్ లక్ష్మణ రేఖను దాటుతున్నారని వ్యాఖ్యానించారు. ఒకవైపు బీజేపీ తెలంగాణపై రాజకీయ దాడి పెంచిందని, మరోవైపు గవర్నర్ పాత్ర అగ్నికి అజ్యం పోస్తున్నట్లుగా ఉందని అన్నారు. ఈ నెల 10న ఉదయం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తమిళిసై రాజ్ భవన్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తారని గవర్నర్ కార్యాలయం బుధవారం ప్రకటించింది. ఈ క్రమంలోనే గవర్నర్ నిర్ణయంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. ఎవరైనా ప్రతినిధులు వస్తే గవర్నర్ ని కలవచ్చు, వారు ఇచ్చే వినతి పత్రాన్ని స్వీకరించి ప్రభుత్వానికి పంపొచ్చు. అంతేగాని ఇలాంటి రాజకీయ కార్యకలాపాలకు రాజ్ భవన్ను ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. మరోవైపు టీఆర్ఎస్ ప్రభుత్వంపై విధానపరంగా సీపీఐ పోరాడుతోందని నారాయణ స్పష్టంచేశారు. మైనర్లను పబ్లోకి అనుమతించడం చట్టరిత్యా నేరమని, పబ్ను సీజ్ చేసి యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని డిమాండు చేశారు.