రాష్ట్రవ్యాప్తంగా రూ.7,289 కోట్ల వ్యయంతో మన ఊరు- మనబడి కార్యక్రమం అమలు చేస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. అందులో భాగంగా ఈ సంవత్సరం 3,497 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలోని 9 వేల 123 ప్రభుత్వ పాఠశాలను బాగు చేస్తున్నామన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో సీజీఐ సౌజన్యంతో బాల వికాస ప్రతినిధులు శౌరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొవిడ్ కిట్లు, హ్యాండ్ వాష్ యూనిట్లను నియోజకవర్గంలోని ఐదు మండలాల ఉన్నత పాఠశాలలకు పంపిణీ చేసి మాట్లాడారు.పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ సంవత్సరంలో మొత్తం 104 ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో మన ఊరు- మనబడి కార్యక్రమం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి విద్యాశాఖ అధికారులు ఎంపిక చేశారని వివరించారు.కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శివలింగయ్య, తదితరులు పాల్గొన్నారు.