తెలంగాణలో అమలవుతున్న పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ ఒక్కటి లేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై రెండు పార్టీల నాయకులు చర్చకు రావాలని సవాల్ విసిరారు. గురువారం జిల్లాలోని మధోల్లో నూతనంగా నిర్మించిన 30 పడకల దవాఖాన భవన నిర్మాణానికి మంత్రులు హరీశ్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ..పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో తెలంగాణ దేశంలో మూడో స్థానంలో ఉంది. బీజేపీ పాలనలో ఉన్న గుజరాత్ చివరి స్థానంలో నిలిచిందని మంత్రి హరీశ్ అన్నారు. పెట్రోల్, డీజిల్, ఎరువులు, వంట గ్యాస్ ధరలు పెంచిన కేంద్ర ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తుందని మండిపడ్డారు. విద్యుత్ సంస్కరణల పేరిట కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని మభ్యపెడుతుంది. ఐదేళ్లలో రూ.25 వేల కోట్లు ఇస్తామంటూ రైతుల బావుల దగ్గర మీటర్లు పెడుతున్నదని అన్నారు. రాష్ట్రంలో యాసంగి వడ్లను కొనకుండా బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. బీజెపీ నాయకులు మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుందన్నారు. మనకు విద్వేషాలు, కొట్లాటలు ముఖ్యం కాదు. గలగల పారే గోదావరి జలాలు కావాలన్నారు. యూపీలో ఈనెల 10న ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయన్నారు.