ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్కు రానున్నారు. సాయంత్రం ముచ్చింతల్లోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో సమతా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సమతామూర్తి కేంద్రం, విగ్రహ పరిసరాలను సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి పరిశీలించారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రధాని పాల్గొనే వేదికల వద్ద భద్రతా ఏర్పాట్లతోపాటు, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తును బ్లూబుక్ ప్రకారం అమలు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. వీవీఐపీ పర్యటన సమయంలో కరోనా ప్రొటోకాల్స్ పాటించేలా చూడాలని హెల్త్సెక్రటరీని సీఎస్ ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే. వీవీఐపీ పాస్ హోల్డర్లకు షెడ్యూల్ చేసిన ప్రోగ్రామ్కు ముందే ఆర్టీ పీసీఆర్ కోవిడ్ టెస్టులు చేయాలన్నారు. పీఎం కాన్వాయ్ వెళ్లే మార్గంలో రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని, లైటింగ్ ఏర్పాట్లు చేయాలని ఆర్ అండ్బీ అధికారులను ఆదేశించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఇతర వేదికల వద్ద ఏర్పాట్లను పరిశీలించాలని రంగారెడ్డి, సంగారెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. శ్రీరానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ వేడుకలకు దేశం నలుమూలల నుంచి ప్రముఖులు హాజరవుతున్నారు. ఇప్పటికే కొందరు ప్రముఖుల పర్యటనలు ఖరారు కాగా.. మరికొందరి తేదీలు ఖరారు కావాల్సి ఉంది.