సర్పంచ్లకు మద్దతుగా టీపీసీసీ పిలుపునిచ్చిన ఆందోళన నేపథ్యంలో రాష్ట్రంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను పోలీసులు ఎక్కడిక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. బయటకు వచ్చిన వారిని అడ్డుకుని అరెస్ట్లు చేస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ధర్నా చేసేందుకు వెళుతున్న ఆయనను ఇంటి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోలీసుల తీరుపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. జూబ్లీహిల్స్లోని ఇంటి వద్ద ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డిని బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో రేవంత్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ధర్నా చేపట్టేందుకు వెళుతున్న రేవంత్ రెడ్డిని ఇంటి బయటే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో రేవంత్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. తన ఇంటికి వచ్చి బయటకు వస్తే అరెస్ట్ చేస్తానంటే ఎలా? అని రేవంత్ ప్రశ్నించారు. మీకు అభ్యంతరం ఉంటే ధర్నాచౌక్ దగ్గర అరెస్ట్ చేయండి అని పోలీసులకు సూచించారు. ఇంటి నుంచి బయటకు వస్తే అరెస్ట్ చేస్తారా? అంటూ ప్రశ్నించారు. తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని, తన ఇంటికొచ్చిన విజయారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని పోలీసులను రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. విజయారెడ్డిని వెంటనే విడుదల చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు ఆయన ఇంటి వద్దకు భారీగా చేరుకున్నారు. దీంతో ఇంటి వద్ద ఘర్ణణ వాతావరణం నెలకొంది. ప్రగతిభవన్ ముందు ధర్నాకు దిగేందుకు కాంగ్రెస్ నేతలు యత్నించారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి ఆందోళనకు దిగేందుకు ప్రయత్నించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు కాంగ్రెస్ నేతలు, శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. గాంధీభవన్ వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. సర్పంచ్ల ధర్నాకు మద్దతుగా సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం కాంగ్రెస్ శ్రేణులు దగ్ధం చేశారు. ఈ నేపథ్యంలో గాంధీభవన్ గేట్లను పోలీసులు మూసేయగా.. కాంగ్రెస్ కార్యకర్తలు గేట్లు దూకి బయటకు వచ్చేంతుకు తీవ్రంగా ప్రయత్నించారు. దీంతో పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట చోటుచేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ధర్నాచౌక్ దగ్గర బారికేడ్లు ఏర్పాటు చేశారు.