తనను రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా సెలవుపై పంపించిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు ఏ మాత్రం వాస్తవం కాదని డీజీపీ మహేందర్ రెడ్డి తేల్చిచెప్పారు. ఇటీవల తాను ఇంట్లో జారిపడటంతో ఎడమ భుజానికి గాయమైందని డీజీపీ తెలిపారు. భుజం పైన మూడు చోట్ల ఫ్యాక్చర్స్ అయినట్లు ఎక్స్ రే, సీటీ స్కాన్, ఎంఆర్ఐ రిపోర్టులలో తేలిందని చెప్పారు. దీంతో విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారని, ఈ క్రమంలో ఫిబ్రవరి 18 నుంచి మార్చి 4వ తేదీ వరకు సెలవులో ఉన్నట్లు తెలిపారు. వైద్యుల సలహా మేరకు విధుల్లో చేరడం జరుగుతుందన్నారు ఈ వాస్తవాలు తెలుసుకోకుండా తనను ప్రభుత్వం బలవంతంగా సెలవులో పంపించిందంటూ రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేయడంపట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. ఒక రాష్ట్ర పార్టీ నాయకుడిగా ఉన్న రేవంత్ రెడ్డి అవాస్తవాలు ప్రచారం చేయడం భావ్యం కాదు. తమ రాజకీయ అవసరాలకు ప్రభుత్వ అధికారులపై ఈవిధమైన అసత్య ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని డీజీపీ పేర్కొన్నారు. ఈ తప్పుడు ఆరోపణలు పోలీస్ శాఖ స్తైర్యాన్ని దెబ్బతీయడంతోపాటు, రాష్ట్ర ప్రజలకు నష్టం కలిగిస్తాయన్నారు. ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, ఇతర అధికారులపై ఆరోపణలు చేసేటప్పుడు విచక్షణ, సంయమనం పాటించాలని కోరుతున్నట్లు డీజీపీ తెలిపారు.