Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

రేషన్‌షాపులో మోదీ ఫోటో ఎక్కడ?.. కామారెడ్డి కలెక్టర్‌పై నిర్మలమ్మ ఆగ్రహం

తెలంగాణలో మూడు రోజుల పర్యటనకు వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ప్రజలకు ఏ మేరకు అందుతున్నాయన్న దానిపై ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీర్కూర్‌లో పర్యటించిన ఆమె ఓ ప్రభుత్వ రేషన్‌ దుకాణాన్ని పరిశీలించారు. అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో లేకపోవడంతో ఆమె అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్‌పై నిర్మలా సీతారామన్‌ ప్రశ్నల వర్షం కురిపించారు. రేషన్‌ బియ్యంలో కేంద్ర వాటా ఎంతో మీకు తెలుసా? అని కలెక్టర్‌ని నిలదీయగా ఆయన తనకు తెలియదని సమాధానం చెప్పారు. పేదలకిచ్చే రేషన్‌ బియ్యంపై కిలోకు 35 రూపాయల ఖర్చవుతుంటే కేంద్రం 29 రూపాయలు భరిస్తోందని.. ఈ విషయం జిల్లా కలెక్టర్‌ తెలియదని చెప్పడం బాగోలేదని అసహనం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో కోట్లాది మంది పేద ప్రజలకు ఉచితంగా రేషన్‌ సరుకులు పంపిణీ చేసిన మోదీ.. ఫోటోను రేషన్‌ షాపులో పెట్టకపోవడం క్షమించరాని చర్యని నిర్మలా సీతారామన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ బీజేపీ నేతలు ప్రధాని ఫోటో పెడుతుంటే అధికారులు బెదిరిస్తున్నట్లు తన దృషికి వచ్చిందన్నారు. సాయంత్రంలోగా మోదీ ఫ్లెక్సీ ఏర్పాటు చేయకపోతే తానే వచ్చి స్వయంగా పెడతానని కలెక్టర్‌ని హెచ్చరించారు.
అంతకుముందు కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఆమె పర్యటించగా.. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్‌ పార్టీ జెండాలతో కేంద్ర మంత్రి కాన్వాయ్‌ను వాళ్లు అడ్డంగా రావడంతో బీజేపీ, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. పోలీసులు లాఠీఛార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img