పట్టపగలు పచ్చి అబద్దాలు మాట్లాడే పార్టీ బీజేపీ అని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. రేషన్ దుకాణంలో ప్రధాని మోదీ పెట్టాలనడం దారుణం అన్నారు. ప్రధాని పదవిని దిగజార్చేలా కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నారని విమర్శించారు. రేషన్ ద్వారా పేదలకు ఇచ్చే బియ్యం మొత్తం కేంద్రమే ఇస్తున్నట్లు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం 10 పైసలు ఇచ్చి రూపాయి ప్రచారం చేసుకుంటోందని ఎద్దేవా చేశారు. అబద్ధాలు చెప్పే కేంద్ర మంత్రుల జాబితాలో మంత్రి నిర్మలా సీతారామన్ కూడా చేరారని హరీశ్ రావు విమర్శించారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేషన్ దుకాణంలో ప్రధాని మోదీ ఫొటో లేకపోవడం ఏంటని కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. మరోసారి తాను వచ్చేటప్పటికి ప్రధాని ఫొటో ఉండాలని ఆదేశించారు. కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో 2020 మార్చి నుంచి కేంద్రం ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తోందని.. రవాణా, గోదాం ఖర్చులను భరించి ప్రజలకు బియ్యాన్ని ఇస్తున్నపుడు రేషన్ దుకాణంలో ప్రధాని మోదీ ఫొటో లేకపోవడం ఏంటని నిర్మలా సీతారామన్ అసహనం వ్యక్తం చేశారు. కిలో బియ్యంపై రూ.35 ఖర్చు అవుతుంటే, కేంద్రమే రూ.29 భరిస్తోందని అన్నారు. శుక్రవారం (సెప్టెంబర్ 2) కామారెడ్డి జిల్లా బీర్కూర్లోని సొసైటీ కార్యాలయంలో రేషన్ దుకాణాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన నిర్మలా సీతారామన్.. ఈ వ్యాఖ్యలు చేశారు.