రాష్ట్రాల సమస్యలను గాలికి వదిలేసి, రైతులను పట్టించుకోకుండా బీజేపీ పాలన కొనసాగిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా గురువారం ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన టీఆర్ఎస్ మహా ధర్నాలో సీఎం పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ‘అనేక ప్రజా సమస్యలు పక్కన పెట్టి, ఎలక్షన్ వచ్చినప్పుడల్లా డ్రామాలాడుతూ.. మత విద్వేషాలు రెచ్చగొట్టి, సెంటిమెంట్ క్యాచ్ చేసుకుని మీరు రాజకీయం నడుపుతున్నారు. కాలం చెల్లిపోయింది. అందరూ గమనిస్తున్నారు. అందరికీ అర్థమైపోయింది. మీ సర్జికల్ స్ట్రైక్లు, మీరు సరిహద్దుల్లో ఆడే నాటకాలు, మీరు చేసే మోసాలు మొత్తం బట్టబయలై బయటకు వచ్చేశాయి.’ అని అన్నారు. దేశానికి, రైతులకు నీళ్లు ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. ప్రతి ఎకరానికి నీళ్లిచ్చే మేధావి తనం లేదన్నారు. . కానీ ఎలక్షన్ వస్తే భైంసా చూపెట్టాలి. ఎలక్షన్ వస్తే హిందూ ముస్లిం కొట్లాట పెట్టాలి. ఎలక్షన్ వస్తే పాకిస్తాన్ పేరు తీసుకొని సెంటిమెంట్ రెచ్చగొట్టాలి. ఇదేనా రాజకీయం. దీని కోసమేనా మిమ్మల్ని ప్రజలను ఎన్నుకున్నది. మీరు దేశానికి సమాధానం చెప్పాలని డిమాండు చేశారు.