రైతు ఏడిస్తే రాజ్యం బాగుపడదని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. కేంద్రం యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనన్న డిమాండుతో సిరిసిల్లలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతల వైఖరిపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పడి ఏడున్నరేళ్ల తర్వాత రైతులు రోడ్డెక్కారని తెలిపారు. ఏడు దశాబ్దాల వెనుకబాటును ఏడాదిలో సీఎం కేసీఆర్ మార్చారని కొనియాడారు. ఏడేళ్ల వరుస కరవు నుంచి ఏడేళ్లలో అభివృద్ధిబాటలో నడిపించారని అన్నారు. చిన్ననీటి వనరుల రూపురేఖలు సీఎం మార్చారని ప్రశంసించారు. కేసీఆర్ ఏడేళ్ల పాలనలో చెరువులు తెగకుండా చూసుకున్నామన్నారు. 3 కోట్ల ఆహారధాన్యాలను తెలంగాణ పండిస్తున్నదని అని అన్నారు. ‘కేంద్రం అన్నీ అమ్ముతోంది. వడ్లు మాత్రం కొనట్లేదు. దేశంలో సాగుకు 40 కోట్ల ఎకరాలు, 65 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. దేశవ్యాప్తంగా వసతులు ఉన్నా వినియోగించుకోలేని దుస్థితి నెలకొంది’ అని అన్నారు. ఆకలి సమస్య ఎదుర్కొంటున్న దేశాలలో ముందంజలో భారత్ ఉందని తెలిపారు. గత 75 ఏళ్లలో దేశాన్ని ఎలా నడిపించారో బీజేపీ, కాంగ్రెస్ సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.