మెదక్ రైల్వే స్టేషన్లో రైల్వే రేక్ పాయింట్ను వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, సహచర మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..దశాబ్దాల కల ఈరోజు నిజమైందన్నారు. సీఎం కేసీఆర్ వల్లే ఇది సాధ్యం అయిందని స్పష్టం చేశారు.పదేళ్లు అధికారంలో ఉన్నా కాంగ్రెస్ ఏనాడూ పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు ఖర్చు చేస్తే ఈ రైలు వచ్చిందన్నారు. త్వరగా రైలు రావాలని మన వాటా కట్టి ఏర్పాటు చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గ్యాస్ సబ్సిడీ కోత , ఉపాధి హామీలో కొత్త, ప్రభుత్వ సంస్థల కోత, ఉద్యోగాల్లో కోత ఇదీ మోదీ ప్రభుత్వం పని తీరన్నారు. ఇదీ అతడి నిజ స్వరూపమన్నారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వండి అంటే ఇవ్వరంట. వరంగల్ కు రైల్వై కోచ్, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ ఇవ్వరంట. కానీ ఉప ఎన్నిక మాత్రం తెస్తరట. మీరు తెస్తామంటున్న ఉపఎన్నిక వల్ల తెలంగాణకు ఏ లాభం? ప్రజలకు ఏం లాభం అని ప్రశ్నించారు. మాటలు చెప్పేది ఎవరో..చేతల్లో అభివృద్ధి చూపెడుతున్నది ఎవరో ప్రజలకు తెలుసని అన్నారు.