: డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి
వచ్చే నాలుగు వారాల్లో కరోనా ఒమిక్రాన్ ఉధృతి తగ్గుముఖం పడుతుందని ప్రముఖ వైద్య నిపుణుడు, ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డి.నాగేశ్వర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.దక్షిణాఫ్రికాలో చాలా వేగంగా కేసులు పెరిగి, అంతే వేగంగా తగ్గినట్టు ఆయన గుర్తు చేశారు. ఇక్కడ కూడా వచ్చే నాలుగు వారాల్లో కరోనా తీవ్రత తగ్గిపోతుందని చెప్పారు. ప్రస్తుతం ఒమిక్రాన్లో సబ్ వేరియంట్ బీఏ.2 వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్టు తెలిపారు. ఆర్టీపీసీఆర్ పరీక్షలకు ఇది చిక్కడం లేదని, ఇప్పటివరకు పరీక్షలో ఎస్ జీన్ కనిపించకపోతే ఒమిక్రాన్గా గుర్తించడం సాధ్యపడేది. కానీ, బీఏ.2 రకం అలా కాదు. ఎస్ జీన్ గుర్తించిన వారిలోనూ వెలుగు చూస్తోందని చెప్పారు. ఒమిక్రాన్ తీవ్రత పెద్దగా ఉండడం లేదని చెప్పారు. కొద్దిమందిలో ముఖ్యంగా, దీర్ఘకాలిక వ్యాధి బాధితుల్లో దీని తీవ్రత కనిపిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఉన్న 20 మంది వరకు ఒమిక్రాన్తో తమ ఆస్పత్రిలోని ఐసీయూల్లో చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు. పిల్లల్లోనూ దీని ప్రభావం కనిపిస్తోందన్నారు. ఒమిక్రాన్ తగ్గిపోయిన తర్వాత నీరసం, బలహీనతతో కొంతమంది ఇబ్బంది పడుతున్నట్టు చెప్పారు.