మరో నాలుగు రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు
తెలంగాణలో భానుడి ప్రతాపం కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో వడదెబ్బకు తాళలేక ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం రాజులగూడకు చెందిన గుణాజీ అనే ఆరేళ్ల బాలుడు, అదే గ్రామానికి చెందిన ఆర్ఎంపీ బాలాజీ (45) వడదెబ్బకు తాళలేక మరణించారు. అలాగే, బోధ్ మండలంలో ఓ నిర్మాణ కూలి (32), సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఈటూరుకు చెందిన రైతు తిగుళ్ల అంజయ్య (48), యాదాద్రి జిల్లా భవనగిరి మండలం రెడ్డినాయక్ తండాకు చెందిన బుజ్జమ్మ (45) వడదెబ్బతో మృతి చెందారు. కాగా, రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.