వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఆర్ఐసీయూలో ఓ రోగి కాలు, చేతివేళ్లను ఎలుకలు కొరికేశాయి. దీంతో అతడికి రక్తస్రావమైంది. ఇంత దారుణం జరిగినా ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోవడంలేదని రోగి బంధువులు మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే, హన్మకొండ జిల్లా భీమారానికి చెందిన శ్రీనివాస్ను నాలుగు రోజుల క్రితం అనారోగ్యంతో వరంగల్ ఎంజీఎంలో చేర్చారు. రోగి పరిస్థితి ఇబ్బందికరంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఐసీయూ వార్డులో ఇలాంటి ఘటన జరగడం దారుణమని రోగి బంధులు వాపోయారు. ఈ విషయం డాక్టర్ల దృష్టికి తీసుకువెళ్లగా తామేమి చేయలేని చెబుతున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. పైప్ లైన్ ద్వారా ఎలుకలు లోపలికి వచ్చి పేషెంట్లను కొరుక్కుతింటున్నాయని వైద్య సిబ్బందే చెబుతున్నారన్నారు. ఐసీయూలో పేషెంట్లను ఎలుకలు కొరుక్కుతింటుంటే.. ఇక సాధారణ రోగుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఎలుకల బెడదపై ఆస్పత్రి ఆర్ఎంవో మురళి దృష్టికి తీసుకెళ్లగా సిబ్బందితో ఆయన ఐసీయూకి వచ్చి పరిశీలించారు. ఎలుకల నివారణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.