భారీ వర్షాలకు కరీంనగర్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి గంగుల కమలాకర్, కరీంనగర్ మేయర్ సునీల్ రావు మంగళవారం పర్యటించారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తంగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి కమలాకర్ అన్నారు. మంగళవారం ఉదయం వరకు జిల్లాలో సగటున 15.31 సెంటీ మీటర్ల వర్ష పాతం నమోదయ్యింది.జిల్లాలోని మానేరు, మోయతుమ్మెద, చిలుక, శంకరపట్నం, ఇరుకుల్ల వాగులు పొంగి పొర్లుతున్నాయి. అనేక గ్రామాల్లో ఇండ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. భారీ వర్షాల కారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మంగళవారం సెలవు ప్రకటించారు.