Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వాడవాడలా గ్రామగ్రామాన స్వతంత్ర వేడుకలు నిర్వహించాలి : సీఎం కేసీఆర్‌

ఎన్నో త్యాగాలు.. ఎన్నో పోరాటాలు..ఎన్నో ఆవేదనలతో కూడిన స్వాతంత్య్రం మనకు సిద్ధించింది.. ఆ స్ఫూర్తిని అందరికీ తెలిసేలా వాడవాడలా.. గ్రామగ్రామాన అద్భుతంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు హెచ్‌ఐసీసీలో సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మొదట సీఎం కేసీఆర్‌ జాతీయ జెండాను ఎగుర వేసి, జెండా వందనం చేశారు. ఆ తర్వాత భరతమాత, మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలవేశారు. అనంతరం జ్యోతిప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు.
స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ సేవలను కొనియాడారు. ‘అనేక త్యాగాలతో, అనేక పోరాటాలతో స్వాతంత్య్రాన్ని సముపార్జించి 75 సంవత్సరాల స్వయంపాలనలో అప్రతిహాతంగా ముందుకుసాగుతున్న భారతావని. 75 సంవత్సరాలు రేపు రాబోయే 15వ తేదీకి పూర్తి చేసుకుంటుంది. సుదీర్ఘకాలం స్వయంపాలనలో సుసంపన్నమైన భారతదేశంలో తరాలు మారుతున్నాయ్‌. కొత్త తరాలు వస్తున్నాయ్‌. వారికి స్వాతంత్య్ర పోరాట సమయంలో జరిగిన సమరం, త్యాగాలు కొత్త తరానికి తెలియవు. ఎప్పటికప్పుడు సందర్భోచితంగా కొత్త తరం వారికి తెలియజేయడం పాత తరం వారి కర్తవ్యం, విధి’ అని అన్నారు.
ఏ దేశానికి స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఒక అపురూపమైన సందర్భమని సీఎం కేసీఆర్‌ అన్నారు. భారత స్వాతంత్య్రం కూడా సుదీర్ఘమైన పోరాటం. సుమారు రెండు శతాబ్దాల పాటు కొనసాగిన పోరాటం. అనేక మంది పెద్దలు, అనేక రకాల పద్ధతుల్లో వలస పాలకులకు వ్యతిరేకంగా అపురూపమైన త్యాగాలు చేస్తూ పోరాటాలు చేశారని అన్నారు. మనం ఎంతో గర్వంగా, సంతోషంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహాత్మాగాంధీ వారసులుగా ఈ దేశ భవిష్యత్‌ను తీర్చిదిద్దడానికి కంకణంకట్టుకున్న వ్యక్తులుగా మనం ప్రజాసేవ రంగంలో మునిగి ఉన్నాం. మీ అందరికీ శ్రమ ఇచ్చి రాష్ట్రం నలుమూల నుంచి పిలిపించిన కారణం ఏంటంటే.. ఒక మహోజ్వలమైనటువంటి స్వతంత్ర వజ్రోత్సవ దీప్తి.. వాడ వాడల గ్రామగ్రామాన చాలా అద్భుతంగా జరగాలి. చాలా గొప్పగా ఎన్ని త్యాగాలతో, ఎన్ని రకాల పోరాటాలతో, వేదనలు.. ఆవేదనలతో స్వాతంత్య్రం వచ్చిందో ప్రతి గడపకు తెలిసేలా నిర్వహించాలి. జిల్లాలో మంత్రుల ఆధ్వర్యంలో కమిటీలు ఉన్నయ్‌.
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ అధ్యక్షులు, మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, ఎంపీపీలు అందరు తమ పరిధిలో వివిధ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఆనాటి స్ఫూర్తిని ఈ వేదికగా మీరు పొంది తిరిగి మీ మీ గ్రామాలు, పట్టణాల్లో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించేందుకు రప్పించమని మనవి చేస్తున్నమన్నారు. ఏయే సందర్భంలో ఎవరు త్యాగాలు చేశారు, ఎన్ని రకాల పోరాటాలు చేశారు.. అలవోకగా తమ అసువులు, ఆయుష్షును దేశ స్వాతంత్య్రం కోసం ధారబోశారు.. మరణానికి వెనుకాడకుండా.. మడమ తిప్పకుండా పోరాటాలు చేశారు.. అలాంటి స్ఫూర్తి, త్యాగనీరతిని మనం ప్రతి గడపకూ వారి పోరాట ఫలితాలు, విశేషాలను ప్రతి మనిషికి తెలపాలని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img