క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా అండగా నిలుస్తుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వివిధ రకాల క్రీడలను ప్రోత్సహించేందుకే ప్రభుత్వం ‘క్రీడా పాలసీ’ తీసుకువచ్చిందన్నారు. యూసుఫ్ గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో నేషనల్ జూనియర్, సబ్ జూనియర్, మాస్టర్ మెన్, ఉమెన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ ను మంత్రి తలసాని ప్రారంభించారు. ఈ పోటీలకు 26 రాష్ట్రాల నుండి 800 మంది హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అన్ని క్రీడలను ప్రోత్సహిస్తుందని, క్రీడాకారులకు చేయూతను అందిస్తుందని చెప్పారు. క్రీడలలో పాల్గొనడం వలన ఎంతో ఆరోగ్యంగా, దృఢంగా ఉంటామని చెప్పారు. ఈ చాంపియన్ షిప్ ఏర్పాటు చేసిన నిర్వహకులు, క్రీడాకారులను ఆయన అభినందించారు. క్రీడలను మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశం తో ప్రభుత్వం క్రీడా పాలసీని తీసుకొచ్చిందని చెప్పారు. ప్రతి మండల కేంద్రంలో క్రీడా మైదానాలు ఉండే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. హైదరాబాద్ వేదికగా నేషనల్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ జరగడం ఎంతో సంతోషిదగ్గ విషయం అన్నారు. ఇలాంటి పోటీల నిర్వహణకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉంటామని అన్నారు.