విశాఖకు కార్గో సేవలను టీఎస్ ఆర్టీసీ గురువారం ప్రారంభించింది.ప్రత్యామ్నాయ ఆదాయ మార్గంగా కార్గో, పార్శిల్ సేవల్ని టీఎస్ ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా కార్గో, పార్శిల్ సేవలను విస్తరించిన ఆర్టీసీ తాజాగా ఈ సేవలను ఏపీకి విస్తరించింది.శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి నేరుగా విశాఖకు కార్గో సేవలను ప్రారంభించింది. ఏపీలో వ్యాపార కేంద్రాలైన విజయవాడ, విశాఖ పట్టణాలకు నేరుగా హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు మీదుగా కార్గో సర్వీసులను ఆర్టీసీ నడుపుతోంది. ఈ వాహనాలు పటాన్ చెరు, మెహిదీపట్నం, లక్డీకాపూల్, సీబీఎస్ నుంచి అందుబాటులో ఉండనున్నాయి. కోదాడ, సూర్యాపేట, విజయవాడ, రాజమండ్రి, అన్నవరం, తుని మీదుగా ఈ వాహనాలు విశాఖకు చేరుకోనున్నాయి.