వైఎస్సార్ హయాంలో చేసిన సంక్షేమ పాలన ప్రతి గుండెను .. ప్రతి గడపను తాకిందని వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల అన్నారు. వైఎస్సార్ ప్రజా సేవలో ఉండి మరణించారని చెప్పారు. ఆయనకు నివాళి అర్పించేందుకు హైదరాబాద్ లాంటి నగరంలో ఒక సెంటు భూమి కూడా లేదన్నారు. కాంగ్రెస్ను రెండు సార్లు అధికారంలోకి తెచ్చిన వైఎస్సార్ను కాంగ్రెస్ ఏం చేసిందంటూ ప్రశ్నించారు. వైఎస్సార్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చిందన్నారు. ఆయనకు కాంగ్రెస్ ద్రోహం చేసిందన్నారు. ఆ శాపమే ఇప్పుడు కాంగ్రెస్ – టీఆర్ఎస్ను వెంటాడుతున్నాయని పేర్కొన్నారు. ఎన్టీఆర్ను అభిమానిస్తున్నారు కానీ, వైఎస్సార్ ను గుర్తించక పోవటం వెనుక ఉద్దేశాలు స్పష్టం అవుతున్నాయని చెప్పారు.
వైఎస్సార్ మెమోరియల్ ఏర్పాటు చేయాలన్నారు. నాడు రోశయ్య వైఎస్సార్ మెమోరియల్ కోసం 20 ఎకరాలు కేటాయిస్తామని చెప్పారన్నారు. కానీ, ఆ ప్రతిపాదన టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారని చెప్పుకొచ్చారు.
టీఆర్ఎస్ కార్యాలయానికి స్థలం వైఎస్సార్ ఇచ్చారని గుర్తుచేసారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ గురించి షర్మిల కీలక వ్యాఖ్యలు చేసారు. రేవంత్ దొంగ.. అడ్డంగా దొరికారు. ఆయన చెబితే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. రోశయ్య కేబినెట్ లో సబితా, దానం నాగేందర్ ఉన్నారని గుర్తు చేసారు. వీరికి రాజకీయంగా వైఎస్సార్ జన్మనిచ్చారని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ మెమోరియల్ హైదరాబాద్లో ఉండాలని షర్మిల డిమాండ్ చేసారు. వైసీపీ గౌరవాధ్యక్ష పదవికి విజయమ్మ రాజీనామా..వైసీపీ పైన స్పందించేందుకు షర్మిల నిరాకరించారు. రాష్ట్రంలో సాధారణ ఎన్నికలే జరుగుతాయని చెప్పారు.తమకు ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. తెలంగాణ లో ముందస్తు ఎన్నికల ముచ్చటే ఉండదని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికలకు ఆరు నెలల ముందు సమీకరణాలు మారుతాయని అభిప్రాయపడ్డారు. వైఎస్సార్టీపీ స్థాపించి ఏడాది పూర్తయిందని..ఈ సంవత్సర కాలంలో పార్టీ ఎంతో పురోగతి సాధించిందని షర్మిల చెప్పుకొచ్చారు. ఇప్పటికీ నిరుద్యోగులకు మద్దతుగా దీక్ష చేస్తున్న విషయాన్ని గుర్తు చేసారు. ఇప్పటికే 1500 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేసినట్లుగా వివరించారు.