వైద్య, ఆరోగ్య రంగలో మనం దేశానికే ఆదర్శంగా ఉన్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాబోయే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నలుదిక్కులా నాలుగు ఆసుపత్రులు రావాలని ఆలోచించారని అన్నారు. ఇవాళ ఎల్బీనగర్, ఎర్రగడ్డ, అల్వాల్ లో మూడు ఆసుపత్రులకు శంకుస్థాపన చేశారు. అల్వాల్ లో ఇంత మంచి స్థలం ఉందని ఎవరూ చెప్పలేదు. సీఎం కేసీఆర్ గారే బాగా ఆలోచించి ఈ ఆసుపత్రులకు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ నేతలు, ఆంధ్రా పాలకులు ఉంటే ఎక్కడ ఏం దొరుకుతుందని చూసేవారు తప్ప. భవిష్యత్తు అవసరాల కోసం ఆలోచించేవారు కాదని అన్నారు. ఇవాళ హైదరాబాద్ నగరంలోని కొత్తపేట(ఎల్బీనగర్), ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్(సనత్ నగర్), అల్వాల్లో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేశారు. అనంతరం అక్కడ జరిగిన బహిరంగ సభలో ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. వైద్య ఆరోగ్య శాఖ చరిత్రలో ఇది చారిత్రాత్మక ఘట్టం. దేశానికి స్వత్రంత్రం వచ్చి 75 ఏళ్లయినా, గత పాలకులు హైదరాబాద్ వైద్య అవసరాలను గుర్తించలేదని హరీశ్రావు అన్నారు. కరోనా పరిస్థితులు క్యాన్సర్, గుండె, కిడ్నీ వ్యాధులు పెరుగుతున్నాయి. పేదలు కార్పోరేట్ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు. ఇది ఆలోచించి సీఎం ఈ ఒక్క రోజు కొత్తగా ఆరు వేల సూపర్ స్పెషాల్టీ పడకలు, వరంగ ల్ లో హెల్త్ సిటీలో మరో 1500 పడకలు.. ఇలా 7500 పడకలు కొత్తగా అందుబాటులోకి వస్తున్నాయి. 3 వేల పడకలు ఐసీయూ సౌకర్యాలు ఉంటాయి. ప్రయివేటులో ఐసీయూకి వెళ్లే రోజుకు 50 వేల నుండి లక్ష రూపాయలు బిల్లు వేస్తారు. ఇది హైదరాబాద్ జంట నగరాల ప్రజలతో పాటు, చుట్టూ ఉండే ఇతర జిల్లా ప్రజలకు ఉపయోగపడుతుందని అన్నారు.