స్పీకర్ ను మరమనిషి అన్నారని టీఆర్ఎస్ ఆగ్రహం
సభ నుంచి సస్పెండ్ చేయాలని కోరిన శాసనసభ వ్యవహారాల మంత్రి
ఈ సెషన్ వరకు ఈటలను సస్పెండ్ చేసిన స్పీకర్
హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందంపై శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి సస్పెన్షన్ వేటు వేశారు. గతవారం ప్రారంభమైన వర్షాకాల సమావేశాల్లో భాగంగా బీఏసీ సమావేశానికి బీజేపీ సభ్యులను స్పీకర్ ఆహ్వానించలేదు. దీనిపై ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి మర మనిషిలా వ్యవహరిస్తున్నారని, సీఎం కేసీఆర్ చెప్పింది చేయడం తప్పా ఆయకు వేరే పని లేదని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో పార్టీకి ఒక్క ఎమ్మెల్యే ఉన్నా బీఏసీ సమావేశానికి పిలిచేవారని, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం సభా సంప్రదాయాలను తుంగలో తొక్కుతోందని తప్పుబట్టారు. అయితే ఈటల రాజేందర్ వ్యాఖ్యలను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈటల వెంటనే స్పీకర్కు క్షమాపణ చెప్పాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు. మరోవైపు ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని స్పీకర్ కార్యాలయం ఆయనకు నోటీసులు జారీచేసింది. ఈ క్రమంలోనే సోమవారం అసెంబ్లీ పున:ప్రారంభం కాగా ఈటల రాజేందర్ హాజరుకాలేదు. మంగళవారం ఈ వ్యవహారంపై చర్చ జరగ్గా మంత్రి ప్రశాంత్రెడ్డి మాట్లాడారు. స్పీకర్ని మరమనిషంటూ వ్యాఖ్యానించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పకపోవడంతో ఈటల రాజేందర్ను సస్పెండ్ చేయాలని ప్రతిపాదించారు. దీంతో స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ఆయన్ని ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. వర్షాకాల సమావేశాలు ఈరోజు ముగియనున్నాయి.