ఆర్టీసీ సర్వీసులను ప్రజలకు దగ్గర చేసుకుందుకై.. లభించిన ఏ అవకాశాన్నీ మిస్ చేయడం లేదు సంస్థ ఎండీ సజ్జనార్. ప్రతి సందర్భాన్ని ఆర్టీసీకి అన్వయిస్తూ.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు వెళ్లేలా ప్రోత్సహిస్తున్నారు. తాజాగా సంక్రాంతి పర్వదినాన రవాణా విషయంలో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులకు ఎండీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ నుంచి వేలాది మంది ప్రజలు తమ తమ సొంతూళ్లకు వెళుతున్నారు. అయితే, ఎవరికి వారు తమ సొంత వాహనాల్లో ఊళ్లకు వెళుతుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీన్ని అవకాశంగా మలుచుకున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. ప్రయాణికులకు కీలక సూచన చేశారు. ‘ఎందుకు అంత ఇబ్బంది పడతారు.. మేమున్నాం కదా మీకు అండగా’ అంటూ ఓ ట్వీట్ చేశారు.
ట్విట్టర్ లో టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్..
‘సంక్రాంతికి సొంత వాహనాల్లో వెళ్లి టోల్ ప్లాజాల వద్ద గంటల తరపడి నిరీక్షించి మీ సమయాన్ని వృథా చేసుకోకండి. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి టోల్ప్లాజాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక లేన్ల ద్వారా వేగంగా గమ్యస్థానాలకు చేరుకోండి. మా సిబ్బంది మిమ్ముల్ని క్షేమంగా సొంతూళ్లకు చేర్చుతారు.’ అంటూ ట్వీట్ చేశారు సజ్జనార్.