సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బేగంపేట డివిజన్ లో 61 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులను పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ముందుగా ఎస్పీ రోడ్ లో ప్యాట్నీ నాలా పై 10 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న వంతెన నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం పాటిగడ్డలో 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న మల్టి ఫర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను,ఎస్ఎన్డిపి కార్యక్రమంలో భాగంగా 45 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న బేగంపేట నాలా అభివృద్ధి పనులను అల్లంతోట బావి, బ్రాహ్మణ వాడి లలో ప్రారంభించారు. పాటిగడ్డ లో స్థానిక ప్రజలను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, నిరుపేదలు శుభకార్యాల నిర్వహణ కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని అన్నారు. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పాటిగడ్డ ప్రాంతంలో ఉన్న పేద, మధ్య తరగతి ప్రజల కోసం ఆర్ అండ్ బి శాఖ కు చెందిన 1200 గజాల స్థలాన్ని జీహెచ్ఎంసికి బదలాయించి 6 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా మల్టి ఫర్పస్ ఫంక్షన్ హాల్ ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. నామమాత్రపు ధరపై ఈ ఫంక్షన్ హాల్ ను అద్దెకు ఇవ్వబడుతుందని తెలిపారు.