తెలంగాణలో ఇటీవల కురిసిన వర్షాలకు భద్రాచలంలో పలు గ్రామాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో శనివారం వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భద్రాచలం పట్టణానికి కరకట్ట ఎత్తు పెంచక పోవడమే వరదలకు కారణమని ఆరోపించారు. 8 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకు కరకట్ట ఎత్తు పెంచలేదని కేసిఆర్ను ప్రశ్నించారు. ‘’సార్ వచ్చాడు.. కట్ట మీద నిలబడి పిట్ట కథలు చెప్పాడు.. వరదలకు విదేశాలు కుట్రలు చేశాయట క్లౌడ్ బరస్ట్ చేశారట.. కేసీఆర్తో పాటు ఆయన కంత్రి మంత్రి ఒకరు ఇలానే మాట్లాడుతున్నారు. పక్క రాష్ట్రంలో ఉన్న పోలవరం కారణం అంటాడు. పోలవరం కారణం అయితే ఇన్నేళ్లు ఎందుకు మెచ్చుకున్నారు. ఇన్నేళ్ళు పోలవరం గురించి ఎందుకు మాట్లాడలేదు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని మీ ఇళ్లకు పిలుస్తారు కౌగిలించుకున్నారు స్వీట్ లు తినిపించారు.అన్ని చేశారు కానీ మాట్లాడుకోవడానికి తీరిక లేదా. అప్పుడు కనిపించలేదా పోలవరం ప్రాజెక్ట్. తప్పించుకోవడానికి కారణం ఎందుకు వెతుకుతున్నారు. భద్రాచలంలో వరదలకు కారణం కేసీఆర్. కరకట్ట ఎత్తు పెంచి ఉంటే భద్రాచలం ప్రజలకు ఈ పరిస్థితి వచ్చేది కాదు’’ అంటూ ఆమె మండిపడ్డారు.