కేంద్రమంత్రి పీయూష్ గోయల్
తెలంగాణ ప్రభుత్వం రైతులను గందరగోళ పరుస్తోందని కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతుల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రధాని కృషి చేస్తున్నారని అన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం నడుస్తున్న నేపథ్యంలో దిల్లీలో ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారని అన్నారు. గత రబీలో అదనంగా 20 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ కొనేందుకు సీఎం కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారని స్పష్టం చేశారు. ఉప్పుడు బియ్యాన్ని అదనంగా తీసుకునేందుకు కూడా కేంద్రం అంగీకరించిందని తెలిపారు. ఈ అవకాశాన్ని కేవలం తెలంగాణకు మాత్రమే ఇచ్చామన్నారు. ఇప్పటివరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ధా న్యాన్ని ఎఫ్సీఐకి తరలించలేదని మండిపడ్డారు. గత ఐదేళ్లలో ధాన్యం సేకరణ మూడు రెట్లు పెరిగిందన్నారు. ఇచ్చే ధరను కూడా 1.5 రెట్లు పెంచినట్లు చెప్పారు. రా రైస్ ఎంత ఇచ్చినా కేంద్రం తీసుకుంటుందని గతంలోనే స్పష్టంచేశామన్నారు. రైతుల ఉజ్వల భవిష్యత్ కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ కృషి చేస్తున్నారన్నారు. కేంద్రంపై అసత్య ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని హితవు పలికారు. ధాన్యం సేకరణలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.