Friday, April 19, 2024
Friday, April 19, 2024

సీపీఆర్‌పై ప్రతి ఒక్కరిలో అవగాహన రావాలి : మంత్రి గంగుల

క్షేత్రస్థాయిలో పని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది సమాజ సేవను సామాజిక బ్యాధతగా గుర్తెరగాలని, ప్రజలకు సేవ చేయడమే పవిత్ర వృత్తిగా భావించాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. నగునూర్‌లోని ప్రతిమ వైద్య కళాశాలలో జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో ఆశ వర్కర్స్, ఏఎన్ఎంలు పంచాయతీ కార్యదర్శులు, పోలీస్‌, మున్సిపల్ సిబ్బంది, అంగన్‌వాడీ సూపర్‌ వైజర్లు, పబ్లిక్‌ హెల్త్‌ సెంటర్ సిబ్బందికి లైఫ్‌ సేవింగ్‌ టెక్నిక్‌ పై శిక్షణ కార్యక్రమాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీఆర్‌ తీరును అడిగి తెలుసుకున్న మంత్రి స్వయంగా సీపీఆర్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో కార్డియాక్ అరెస్టులతో చాలా మంది యువకులు ఉన్నట్టుండి అకస్మాత్తుగా మరణస్తున్నారన్నారు. ఇలాంటి మరణాలు ఇక ముందు జరగొద్దని, ఒక వేళ జరిగినా వారిని కాపాడాలని సంకల్పించి క్షేత్రస్థాయిలో పని చేస్తున్న సిబ్బందికి సీపీఆర్‌పై శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భూమిపై మనం ఎవరం శాశ్వతం కాదని, ఉన్నన్ని రోజులు ఆరోగ్యంగా ఉండాలన్నదే ఆకాంక్ష అన్నారు.ఎన్ని లక్షల కోట్లు వెచ్చించిన కొనలేనిది ప్రాణం మాత్రమేనని, మనం చేసిన సేవలే చిరస్థాయిగా నిలుస్తాయన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలందరికీ సేవ చేసే అవకాశం దేవుడు మీ అందరికీ కల్పించాడని, దాన్ని పవిత్రవృత్తిగా భావించాలని అన్నారు. కార్డియాక్ అరెస్టు వచ్చిన వారందరినీ సీపీఆర్ చేసి బతికించలేకపోయినా.. దాంతో ఏ ఒక్క ప్రాణాన్ని కాపాడినా మన జన్మకు ఇంత కన్నా మించిన తృప్తి ఉండదన్నారు. ఒకప్పుడు చేసే పనులతో శారీరక శ్రమ కారణంగా ఆరోగ్యంగా ఉండేవాళ్లమని, ప్రస్తుతం ఆహారపు అలవాట్లు, ఆటలకు, పనులకు దూరమై శారీరక శ్రమ అనేది లేకుండా పోయిందన్నారు.నేటికాలంలో కార్డియాక్ అరెస్టులకు చాలా కారణాలు ఉన్నాయని, ప్రధానంగా రక్తంలోని కొవ్వే కార్డియాక్ అరెస్టులకు ప్రధాన కారణమన్నారు. నేటి రోజుల్లో ఎలాంటి అలవాట్లు లేని చిన్నపిల్లలకు కార్డియాక్ అరెస్టుకావడంపై ఆలోచించాలని, కరోనా తర్వాత మన శరీరంలో కొన్ని మార్పులు జరిగాయని అన్నారు. కరీంనగర్ జిల్లాలో కార్డియాక్ అరెస్టులతో మృత్యువాత పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, అందుకోసం విద్యార్థులకు కాలేజీల్లో నిర్బంధ వైద్య పరీక్షలు చేయిస్తున్నామన్నారు.కార్డియాక్ అరెస్టులపై తెలంగాణలోనే కరీంనగర్ జిల్లాలో ప్రప్రథమంగా స్క్రీనింగ్ కార్యక్రమాన్ని చేపట్టామని, ప్రజల ప్రాణాలు కాపాడడమే ధ్యేయమన్నారు. ప్రజా ఆరోగ్యమే మాకు ముఖ్యమన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి, కలెక్టర్ కర్ణన్, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు, మేయర్ సునీల్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ జువేరియ, మున్సిపల్ కమిషనర్ సేవ ఇస్లావత్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img