మరమగ్గంపై పరిమళాలు వెదజల్లే పట్టుచీరను తయారు చేసి మరోసారి ప్రతిభ చాటుకున్నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సాయినగర్కు చెందిన నేత కార్మికుడు నల్ల విజయ్. ఇప్పటి వరకు అగ్గి పెట్టెలో పట్టే చీర నుంచి మొదలుకుని దబ్బనంలో దూరే చీరలు తయారు చేసిన ఆయన, ఈసారి 27 రకాల సుగంధ ద్రవ్యాలు కలిపి పరిమళాలు వెదజల్లే పట్టుచీరను మరమగ్గంపై నేసి.. అందరి దృష్టిని ఆకర్షించాడు. చేనేత కళాకారుడు నల్ల విజయ్ వినూత్న ఆలోచనతో తయారు చేసిన 27 సుగంధ ద్రవ్యాలతో పరిమళించే పట్టు చీరను మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఆవిష్కరించారు. విజయ్ విజ్ఞప్తి మేరకు ఈ చీరకు సిరి చందన పట్టుగా మంత్రులు నామకరణం చేశారు. ఈ సందర్భంగా యువ చేనేత కళాకారుడు విజయ్ను మంత్రులిద్దరూ అభినందించారు.