రాజేంద్రనగర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నూతన అకాడమిక్ భవన సముదాయానికి గురువారం ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్లాంటి నగరంలో ఐఐపీహెచ్ సంస్థ ఉండడం మంచి విషయమన్నారు. 2015లో సీఎం కేసీఆర్ 45 ఎకరాల భూమి ఐఐపీహెచ్కు ఇచ్చారని, అలాగే ప్రజారోగ్యంపై దృష్టి పెట్టి రూ.10కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారన్నారు. ఇటీవల ప్రజలు, ప్రభుత్వాలు ప్రజారోగ్య ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాయని, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అవసరమైన వసతులు సమకూర్చుకుంటున్నాయన్నారు.తెలంగాణ ప్రభుత్వం ఎనిమిదేళ్ల కృషికి మంచి ఫలితాలు వచ్చాయని, ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె, పట్టణ ప్రగతితో మలేరియా, డెంగ్యూ జ్వరాలు తగ్గాయన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆరోగ్య సూచికల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధించామన్న మంత్రి హరీశ్.. ఇటీవల రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వైద్యరంగంలో తెలంగాణ చేస్తున్న కృషిని ప్రశంసించిందని గుర్తు చేశారు. వైద్యసేవల మీద ఎక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందన్నారు. నగరాలు, పట్టణాల్లో స్లమ్ ఏరియాలు ఎక్కువగా ఉంటాయని, దీంతో సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు. వీటి ద్వారా పేదలకు వైద్యం అందించే ప్రయత్నాల్లో ఉన్నామన్నారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో మనం ముందున్నామని, వైద్య ఆరోగ్య రంగంలో కూడా తెలంగాణ దేశానికి దిక్సూచి కావాలన్నది సీఎం కేసీఆర్ ఆకాంక్ష అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్శర్మ, ఐఐపీహెచ్ ప్రెసిడెంట్ శ్రీనాథ్రెడ్డి, బోర్డ్ డైరెక్టర్లు, సభ్యులు పాల్గొన్నారు.