భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలలో భాగంగా వనపర్తి లక్ష్మికుంట వద్ద ఫ్రీడం పార్క్లో విద్యార్థులు, పట్టణవాసులతో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పెద్దఎత్తున మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..అవకాశం ఉన్న ప్రతి చోటా ఫ్రీడం పార్కులను నిర్మిస్తామని అన్నారు. శ్రీనివాసపురం లక్ష్మికుంట భవిష్యత్ లో రాష్ట్రంలో ప్రముఖ ప్రాంతంగా మారబోతున్నది. రూ.కోటిన్నర వెచ్చించి చిన్న కుంటను పెద్ద చెరువుగా మార్చామన్నారు. లక్ష్మికుంట సమీపంలో 35 ఎకరాలలో ఫ్రీడం పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. వనపర్తిలో 11 వేల ఎకరాలలో అటవీ ప్రాంతం ఉందని, అటవీ ప్రాంతాలలో చెరువుల మూలంగా వివిధ రకాల జీవజాతుల పెంపునకు దోహదం పడుతుందన్నారు. సీఎం కేసీఆర్ తలపెట్టిన భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలలో ప్రజలు భాగస్వాములు కావాలని మంత్రి కోరారు.