విశాలాంధ్ర`హైదరాబాద్ : హుస్సేన్సాగర్లో వినాయక నిమజ్జనానికి సుప్రీంకోర్టు అనుమతించింది. ఈ మినహాయింపు ఈ ఏడాదికేనని స్పష్టం చేసింది. హుస్సేన్సాగర్లో పీవోపీ (ప్లాస్టర్ ఆఫ్ పారిస్) విగ్రహాల నిమజ్జనానికి వీల్లేదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఏడాది నిమజ్జనానికి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విచారణ సందర్భంగా రమణ మాట్లాడుతూ హైదరాబాద్లో ఇది కొత్తగా వస్తున్న సమస్య కాదని.. చాలా ఏళ్లుగా ఉందన్నారు. ప్రత్యామ్నాయం లేదా? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం తీరు సంతృప్తికరంగా లేదనీ ఇదే చివరి అవకాశమని చెప్పారు. కోట్లాది రూపాయలు సుందరీకరణ కోసం ఖర్చు చేస్తున్నారనీ, ఇలాంటి కార్యక్రమాలకు అవకాశం కల్పించడం వల్ల ఆ నిధులు వృథా అవుతున్నాయని అన్నారు. ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. విగ్రహాల నిమజ్జనం కోసం 22 చిన్న చెరువులను ప్రభుత్వం సిద్ధం చేసిందని.. కానీ అందులో పెద్ద విగ్రహాల నిమజ్జనం సాధ్యంకాదని చెప్పారు. అందుకే ఈ ఏడాదికి మినహాయింపు కోరుతున్నామన్నారు. దీనిపై పిటిషనర్ వేణుమాధవ్ స్పందిస్తూ ఏటా ఇలాగే చెబుతూ మళ్లీ మొదటికి వస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాదికే అనుమతిస్తున్నట్లు సీజేఐ స్పష్టం చేశారు. ఇకపై హుస్సేన్సాగర్లో ఎలాంటి నిమజ్జన, కాలుష్యం పెంచే కార్యక్రమాలు చేపట్టబోమంటూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించగా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత తదుపరి అన్ని విషయాలు రాష్ట్ర హైకోర్టు పరిశీలిస్తుందని ధర్మాసనం పేర్కొంది.