హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీద కేసుల పరంపర కొనసాగుతోంది. సెప్టెంబర్ 25న ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఇండియా – ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ నేపథ్యంలో హెచ్సీఏ మీద కేసుల మీద కేసులు నమోదయ్యాయి. టికెట్ల విక్రయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ.. మహమ్మద్ అజారుద్దీన్తో పాటు హెచ్సీఏ నిర్వాహకులపై హైదరాబాద్లోని పలు పోలీస్ స్టేషన్లలో మూడు కేసులు నమోదయ్యాయి. టికెట్ల తోపులాట ఘటనలో గాయపడిన బాధితుల ఫిర్యాదుల మేరకు.. హైదరాబాద్ యాక్ట్తో పాటు 420, 21, 22/76 పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం.. టికెట్ల మీద టైమింగ్ మార్చారంటూ ఓ యువకుడు బేగంపేటలో ఫిర్యాదు చేయటంతో.. మరో కేసు నమోదైంది. ఇదిలా ఉంటే.. అజారుద్దీన్పై ఇప్పుడు మరో కొత్త ఆరోపణతో కేసు నమోదైంది. హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు జి.వినోద్, సెక్రటరీ శేషు నారాయణ్, హెచ్సీఏ మెంబర్ చిట్టి శ్రీధర్ బాబు కలిసి రాచకొండ సీపీ మహేశ్ భగవత్కు కంప్లైంట్ చేశారు. సెప్టెంబర్ 26 తేదీతోనే హెచ్సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్ గడువు ముగిసిందని.. అయినా పదవిలో కొనసాగుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గడువు ముగిసిన తర్వాత కూడా తప్పుడు డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి బీసీసీఐతో పాటు ఈసీ కమిటీని తప్పుదోవ పట్టించే విధంగా అజారుద్దీన్ వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పదవి కాలంపై ఎవరిని సంప్రదించకుండా ఆయనకు ఆయనే గడువు పొడిగించుకుంటూ ఉత్తర్వులు జారీ చేసుకున్నారని కంప్లైంట్లో వివరించారు. ఈ నెల 18న బీసీసీఐ జనరల్ బాడీ మీటింగ్కు హాజరు అయ్యేందుకు అజారుద్దీన్ తన పదవి సమయాన్ని పొడిగించుకున్నట్లు ఆరోపించారు. ఈ ఆరోపణలను పరిగణలోకి తీసుకుని.. అజారుద్దీన్పై క్రిమినల్ కేసు నమోదు చేసి.. చట్టప్రకారం చర్యలు తీసుకోవాలంటూ మహేష్ భగవత్ను కోరారు.