ఐదు రోజులుగా భాగ్యనగరాన్ని వర్షం వీడటంలేదు. ఇవాళ ఉదయం నుంచి కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తూనే ఉంది. జూబ్లీహిల్స్లో సాయంత్రం కుండపోత పోసింది. ఆగకుండా కురుస్తున్న ముసురుతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో మూడు రోజులు తెలంగాణతోపాటు నగరంలో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అప్రమత్తంగా ఉండాలని నగర వాసులను జీహెచ్ఎంసీ హెచ్చరించింది.
నేడు, రేపు భారీవర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వల్ల నేడు, రేపు హైదరాబాద్ సిటీలో భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఈ రోజుకి దక్షిణ, ఒడిశా, దక్షిణ చత్తీస్గఢ్ మీదుగా వెలుతూ క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభారం వల్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలతో పాటు గంటకు 30నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
ప్రజలను అప్రమత్తం చేసిన జీహెచ్ఎంసీ..
ఇటీవల కురిసిన వర్షాలకు ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలను మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అవసరం అయితే తప్ప బయటకు రావద్దని నగరప్రజలకు సూచించింది. నగరంలో పాత భవనాల్లో ఉంటున్న వారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసర సహాయం కోసం వెంటనే జీహెచ్ఎంసీ హెల్ప్లైన్ నెం బర్ 040-29555500కు ఫోన్ చేయాలని నగరవాసులకు బల్దియా సూచించింది.