హోలీ సందర్భంగా హైదరాబాద్ నగరంలో పోలీసులు ఆంక్షలు విధించారు. హౖదరాబాద్ మహా నగర పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. జంట నగరాల పరిధిలో 48 గంటల పాటు ఆ ఆంక్షలు అమలు ఉంటాయని పేర్కొన్నారు. అలాగే హోలీ సందర్భంగా రేపు సాయంత్రం నుంచి బార్లు, వైన్స్, కల్లు దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు. హోలీ వేడుకల్లో పాల్గొనే వారు ఇతరులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని పోలీసు ఉన్నతాధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. నగరంలో తిరిగే వాహనదారులపై రంగులు చల్లరాదని పేర్కొన్నారు. వాహనాలపై పబ్లిక్ రోడ్స్ లో గుంపులుగా తిరుగుతూ న్యూసెన్స్ చేయొద్దని సూచించారు. ఈ ఆంక్షలు నగరంలోని మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో అమలులోకి రానున్నాయి.
గురువారం సాయంత్రం 6 నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు. ఈనెల 17వ తేదీ గురువారం సాయంత్రం 6 నుంచి 19వ తేదీ శనివారం ఉదయం 6 గంటల వరకు జంట నగరాల్లోని బార్లు, వైన్స్, కల్లు దుకాణాలను మూసి ఉంచాలని ఆదేశించారు.