తెలంగాణ ప్రభుత్వానికి రెవెన్యూ ఉద్యోగులు షాకిచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా విధులకు హాజరయ్యేది లేదంటూ వీఆర్ఏలు సమ్మె సైరన్ మోగించారు. ఈ నెల 25 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ నాయకులు శుక్రవారం భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయానికి నోటీసు అందజేశారు.ఈ సందర్భంగా జేఏసీ ఛైర్మన్ ఎం.రాజయ్య, కో ఛైర్మన్ రమేష్ బహదూర్ మీడియాతో మాట్లాడుతూ… వీఆర్ఏలకు పే స్కేలు ఇస్తామని, తండ్రుల స్థానంలో అర్హులైన పిల్లలు ఉంటే ఉద్యోగాలు కల్పిస్తామని, అర్హత ఉన్నవారికి పదోన్నతి కల్పిస్తామని 2020 సెప్టెంబరు 9న శాసనసభలో కొత్త రెవెన్యూ చట్టంపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని రెండుసార్లు సభలో హామీ ఇచ్చి.. 2017 ఫిబ్రవరి 24న కూడా ప్రగతి భవన్లో దీనిపై ప్రకటన చేసినా ఇప్పటి వరకు పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో 21వేల మంది వీఆర్ఏలు, 2500 మంది డైరెక్ట్ రిక్రూట్ వీఆర్ఏలు విధుల్లో ఉన్నారని.. వీరిలో 90 శాతం మంది వెనుకబడిన సామాజిక వర్గాలకు చెందిన నిరుపేదలేనని వెల్లడిరచారు. పెరిగిన జీవన వ్యయం నేపథ్యంలో వీరంతా అర్ధాకలితో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వానికి వివిధ రూపాల్లో ఇప్పటికే నిరసన తెలియజేసినా… రెవెన్యూ శాఖ నుంచి గానీ, ప్రభుత్వం నుంచి గానీ స్పందన లేకపోవడంతో సమ్మె చేయాలని నిర్ణయించినట్లు వెల్లడిరచారు.