జాతీయవిపత్తుగా ప్రకటించి తక్షణ ప్యాకేజ్ ఇవ్వండి
తెలంగాణలో వరదలపై ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి లేఖ
తెలంగాణ రాష్ట్రాన్ని వర్షాలు, వరదలు ముంచెత్తాయి. గత పది రోజులుగా కురిసిన భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ నుండి వస్తున్న వరదతో తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యాయి. గోదావరికి వరద పోటెత్తడంతో అనేక గ్రామాలు నీట మునిగి, ప్రజలు నిరాశ్రయులయ్యారు. అపార పంట నష్టం, ఆస్తి నష్టం చోటుచేసుకుంది. ఈ క్రమంలో తెలంగాణ లో వరదల పరిస్థితిని జాతీయ విపత్తుగా పరిగణించాలని ప్రధాని నరేంద్ర మోదీకి టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రానికి తక్షణ ఉపశమన ప్యాకేజీగా 2 వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందించాలని లేఖలో కోరారు. రోడ్లను మరమ్మతు చేయడానికి పునర్నిర్మించడానికి, నిత్యావసర వస్తువుల సరఫరాను పునరుద్ధరించటానికి కేంద్రం సహాయం అందించాలని రేవంత్ రెడ్డి కోరారు. అంతేకాదు వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో 11 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు వరద ముంపునకు గురయ్యాయని లేఖలో పేర్కొన్న రేవంత్ రెడ్డి వరద ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని దయనీయమైన పరిస్థితి నెలకొందన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం వరద పరిస్థితిని అంచనా వేయడంలో పూర్తిగా విఫలమైందని రేవంత్ రెడ్డి ప్రధాని మోడీకి రాసిన లేఖలో ఆరోపించారు. రాష్ట్రంలో కుండపోత వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారితే, గ్రామాలన్నీ చెరువులను తలపిస్తూ ఉంటే..ే కేసీఆర్్ మాత్రం అలాంటిదేమీ లేదని చెబుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కమీషన్ల కోసం ఒక లక్ష కోట్లతో ప్రాజెక్టులు కడుతున్నారని, కానీ వాటి నిర్వహణకు నయాపైసా విడుదల చేయడం లేదని మండిపడ్డారు. కాంట్రాక్టర్లకు, కమిషన్ ఇచ్చేవారికి ప్రగతి భవన్ గేట్లు తెరుచుకుంటాయి కానీ ప్రాజెక్టుల నిర్వహణకు నిధులు ఇవ్వడానికి మాత్రం ప్రగతిభవన్ గేట్లు తెరుచుకోవని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కు ఉన్న ధన దాహం, అధికార దాహం ప్రాజెక్టుల నిర్వహణ పై కేసీఆర్ పెడుతున్న శ్రద్ధతో అర్థమవుతుంది అంటూ ఎద్దేవా చేశారు. రైతులకు ఎకరాకు రూ.15,000 నష్టపరిహారం, విత్తనాలు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి భారీ వర్షాలకు 857 గ్రామాల్లో వరద నీరు చేరింది అని పేర్కొన్న రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని వివిధ గ్రామాలలో నెలకొన్న పరిస్థితిని మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావడానికి జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాన్ని వెంటనే పంపించాలని ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు పంట నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని వెంటనే పంపాలన్నారు. రైతులకు ఎకరాకు రూ.15,000 నష్టపరిహారం ఇవ్వాలని, పంటలను తిరిగి సాగు చేసేందుకు విత్తనాలు, ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రధానికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.