ఆదివాసీలపై దాడులు చేస్తే పోరాటాలకు సిద్ధం
తెలంగాణ సాధించుకున్నది నీళ్లు, నిధులు, నియామకాల కోసం
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
విశాలాంధ్ర బ్యూరో`పెద్దపల్లి : తెలంగాణలో భూమి కోసం జైల్లో ఉండే దుర్మార్గపు పరిస్థితి ఏర్పడిరదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో ఆదివాసీలపై దాడులు చేస్తే పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం కోయకొచగూడె గ్రామ ఆదివాసీ మహిళల పై అటవీ శాఖ పోలీసులు చేసిన దాడిని ఖండిస్తున్నామని అన్నారు. కోయకొచగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీలు ప్రభుత్వం భూమిలో గుడిసెలు వేయడంతో అటవీ శాఖ అధికారులు వారిపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బుధవారం ఆదివాసీలను కలిసిన నారాయణ జరిగిన సంఘటనపై మాట్లాడుతూ ఆదివాసీలపై కేసులు ఎత్తివేసి, దాడులు చేసిన అధికారులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన, ఆదివాసీ ప్రజల భూములకు పట్టాలు ఇచ్చే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని అన్నారు. తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేసింది నీళ్లు, నిధులు, నియామకాల కోసమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు కలవేనా శంకర్, కరీంనగర్ సీపీఐ నాయకులు కొయ్యడ సృజన కుమార్, మంచిర్యాల సీపీఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.