జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు రూ.1453 కోట్లు చెల్లించటానికి కేంద్ర పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సానుకూలంగా స్పందించారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రి బుడి ముత్యాల నాయుడు తెలిపారు. కేంద్ర మంత్రి తిరుమల తిరుపతి పర్యటనలో భాగంగా సోమవారం మధ్యాహ్నం తిరుపతి పద్మావతి అతిధి గృహంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పార్లమెంటు సభ్యులు చిత్తూరు — రెడ్డప్ప, తిరుపతి డా.గురుమూర్తి , అనకాపల్లి – సత్యవతి జెసి డీకే బాలాజీ, రాష్ట్ర డైరెక్టర్ చిన్న తాతయ్య, జిల్లా అధికారులు కేంద్ర మంత్రిని కలిసి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై వివరించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి మీడియాకు వివరిస్తూ కేంద్ర మంత్రి తిరుపతి పర్యటన సందర్భంగా వారికి స్వాగతం పలికి రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలకు కేంద్రం నుండి రావలసిన బకాయిలను, కేంద్ర అనుసంధాన పథకాలలో పేదలకు కొన్ని వెసులుబాటు కోసం వినతి పత్రం అందించామని వివరించారు.